నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. వాననీటితో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసి ముద్దయ్యాయి. పిడుగులు పడి వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల రెండు గంటలపాటు ఈదురు గాలులతో కూడిన వాన పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు చోట్ల చెట్లు నేలకూలాయి. వరంగల్రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో పొలంలో పని చేస్తున్న ఆరెల్లి కాంతమ్మ(45), నడికూడ మండలం రాయపర్తిలో గంగోజుల రవీంద్రచారి(40), ములుగు జిల్లా కాసిందేవిపేటలో ఎండీ రంజాన్(65), పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారానికి చెందిన రాచకొండ కిష్టయ్య (48) పిడుగుపడి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో మల్లయ్య (45) అనే వ్యక్తి చెట్టు విరిగిపడి మృతిచెందాడు.