కోదాడ రూరల్, జూలై 4 : పట్టణ ప్రాంతాలకు పరిమితమైన మొబైల్ ఇండ్లు పల్లెలకూ వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన అనంతరాంరెడ్డి తన పొలంలో గెస్ట్హౌస్ నిర్మించాలనుకున్నాడు. మిత్రుల ద్వారా హైదరాబాద్ నగరం కొంపల్లిలో మొబైల్ ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని తెలుసుకుని రూ.6లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాడు. ఆదివారం లారీలో గ్రామానికి తరలించగా.. క్రేన్ సహాయంతో తన పొలంలో ఏర్పాటు చేసిన పిల్లర్లపై ఉంచారు. అందులో కిచెన్ కమ్ హాల్, బెడ్రూం, అటాచ్డ్ బాత్రూం ఉన్నాయి. ఇంటిపైకప్పు పూర్తిగా ఐరన్ వాడగా లోపల చెక్కతో ఏర్పాటు చేశారు. మార్బుల్ బండలను వేశారు. ఈ ఇల్లు కోదాడ, మేళ్లచెర్వు ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయడంతో స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇల్లు కావాలనుకునే వారు ఆర్డర్ ఇచ్చిన 20 రోజుల్లో తయారు చేస్తారని, చిన్న కుటుంబానికి మంచిగా సరిపోతుందని, ఎక్కడికంటే అక్కడికి తరలించుకునే వెసులుబాటు ఉంటుందని అనంతరాంరెడ్డి చెప్పాడు. ఈ ఇల్లు సుమారు 25 సంవత్సరాలు మన్నిక ఉంటుందని తయారుదారులు చెప్పినట్టు తెలిపాడు.