ములకలపల్లి, ఆగస్టు 1: ప్రైవేట్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండ లం సీతాయిగూడేనికి చెందిన సోయం ప్రసాద్, సుజాత దంపతులు. సుజాత నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే కడుపులోని శిశువు మృతిచెందినట్టు నిర్ధారించారు. మెరుగైన చికిత్స అందించేందుకు ఖమ్మం తరలించాలని సూచించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా కరోనా బాధితురాలని ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి చికిత్స అందించలేదు. దీంతో ఆమె భర్త బాధితురాలిని ఖమ్మంలోని పలు దవాఖానలకు తిప్పాడు. ఎవరూ వైద్యం చేయడానికి ముందుకురాలేదు. చివరికి ప్రభుత్వ దవాఖానకు తరలించాలనుకునే లోపే ఆమె మరణించింది.