నిర్మల్ : రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడెం మండలం గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దత్తోజిపేట్లో వాగు ఈ ఉదయం ఉప్పొంగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కానీ వాగు ఉప్పొంగడంతో ఆమెను తరలించలేకపోయారు. నాలుగు గంటల పాటు వాగు వద్దే ఉండిపోయింది. పురిటినొప్పులు అధికమవడంతో.. వాగు వద్దే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వాగు ఉధృతి తగ్గిన తర్వాత కడెం ఆస్పత్రికి బాలింత ఎల్లవ్వను ట్రాక్టర్లో తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.