హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం గాని లేదా శనివారం ఉదయం గాని గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో నష్ఠాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరురి రమేష్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, వరంగల్ సీపీ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్లు నిఖిల, కృష్ణ ఆదిత్య, హరిత, మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు, నీటి పారుదల, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.