నిర్మల్ టౌన్, మార్చి 27 : 2008 సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 27 పనులకు నిర్మల్ నియోజకవర్గంలో శ్రీకారం జరిగాయి. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడ్డాక 2016లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేసింది. రూ.714 కోట్లు నిధులు రాగా.. ఓ ప్రైవేట్ కంపెనీ 2019 వరకు పను లు చేపట్టింది. ఇందులో రూ.432 కోట్లు మాత్రమే ఖర్చు చేసి… పనులు నిలిపివేశారు. దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ను ఉపయోగించుకొని పంప్హౌస్ పనులతోపాటు గుండంపల్లి నుంచి మాడేగాం గుట్ట వరకు ప్రధాన పైప్లైన్, మాడేగాం గుట్ట నుంచి నర్సాపూర్, కుంటాలకు రైట్ కెనాల్, దిలావర్పూర్, నిర్మల్కు లెఫ్ట్ కెనాల్ పనులు మాత్రమే చేశారు.
మంత్రి అల్లోల చొరవతో రీ టెండర్
నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యాకేజీ 27 ద్వారా మిగిలిన పనులకు ప్రభుత్వం రూ.332 కోట్లతో రీటెండర్ పనులను చేపడుతున్నది. ఇందులో మూడు విభాగాలుగా పనులను కేటాయించింది.
మొదటి యూనిట్లలో గుండంపల్లి పంప్హౌస్ వద్ద మిగిలిన పనులతోపాటు బన్సపెల్లి, గుండంపల్లి, మాడేగాం గుట్ట వరకు పైప్లైన్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
రెండో యూనిట్ కింద మాడేగాం గుట్ట నుంచి కుడి, ఎడమ కాలువ పనులను చేపట్టనున్నారు. కుడి కాల్వ ద్వారా దిలావర్పూర్, నర్సాపూర్, కుంటాల మండలంలోని 13 కిలోమీటర్ల ప్రధాన కెనాల్లో మిగిలిన పనులతోపాటు ప్రధాన కెనాల్కు అనుసంధానంగా ఉండే పిల్ల కాలువలు, షెట్టర్ల నిర్మాణం, ఉప కాలువలు, ప్రధాన కాలువలపై బిడ్జిల నిర్మాణం, మిగిలిన సిమెంట్ పనులు, కాజువే పనులను చేపట్టనున్నారు. ఈనెల 7న టెండర్లు తెరువనున్నట్లు అధికారులు తెలిపారు. ఎడమ కెనాల్ ద్వారా దిలావర్పూర్ మండలంలోని లోలం, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్ గ్రామాల వరకు ఉన్న కాలువ మరమ్మతులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలోని మాడేగాం గుట్టపై రెండో యూనిట్ కింద 4 వేల ఎకరాలకు నీరు అందించేందుకు పంప్హౌస్ కెనాల్ పనులను కూడా చేపట్టనున్నారు.
మూడో యూనిట్ కింద సోన్ మండలంలోని కడ్తాల్ వై జంక్షన్ వద్ద ఎస్సారెస్పీ సరస్వతి కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని తోడే పంప్హౌస్ను నిర్మించి మేడిపెల్లి వరకు 9 కిలోమీటర్ల పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి గ్రావెడ్ ద్వారా నిర్మల్, మామడ, లక్ష్మణచాంద మండలంలోని 23 గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు అటవీశాఖ అనుమతులను తీసుకోవాలి. ఇందుకోసం 300 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించగా.. మూడో ప్యాకేజీకి నిధులు మంజూరయ్యే అవకాశం ఏప్రిల్లో ఉన్నట్లు ఈఈ రామారావు తెలిపారు. ఈ పనులన్నింటిని కూడా మూడేళ్లలో పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన పనులను ఏప్రిల్ నుంచే ప్రారంభించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.