మరణాలు మాత్రం ముందుకంటే తక్కువే
మూడింట ఒక వంతు తగ్గిన మరణాలు
ప్రస్తుత దశలో యువతకు అధికంగా కరోనా
అందుబాటులో టీకా, మెరుగైన చికిత్స
మరణాల రేటు తక్కువకు ఇవే కారణాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతమవుతున్నది. అయితే వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నప్పటికీ.. మరణాల శాతం మాత్రం ముందుకంటే తక్కువగానే ఉన్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేసుల వృద్ధి రేటును బట్టి మహమ్మారిని రెండు దశలుగా విభజించవచ్చు. మొదటిది.. గత ఏడాది జనవరిలో ప్రారంభమై.. సెప్టెంబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరి.. ఫిబ్రవరి మధ్యనాటికి తిరిగి తగ్గుముఖం పట్టింది. ఇక రెండోది ప్రస్తుతం కొనసాగుతున్నది. చాలా రాష్ర్టాల్లో (మహారాష్ట్ర, పంజాబ్ మినహా) ఫిబ్రవరి తర్వాత ఈ రెండోదశ మొదలైంది. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల్లో (మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛండీగఢ్) రోజువారీ సగటు కేసులు తొలిదశ కంటే ఎక్కువగా ఉన్నాయి.
మరణాల్లో తగ్గుదల
మహారాష్ట్రలో తొలిదశ గతేడాది మార్చి 9న మొదలై, డిసెంబర్ 22న ముగిసింది. ఈ 288 రోజుల వ్యవధిలో 19 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 6,606 కేసులు రికార్డయ్యాయి. డిసెంబర్ 22 నుంచి ఆ రాష్ట్రంలో కేసుల పెరుగడం మొదలైంది. అప్పటి నుంచి మార్చి 31వరకు 99 రోజుల్లో ఏకంగా 9.1 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 9197 కేసులు రికార్డయ్యాయి. పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. అయితే, కేసులు భారీగా నమోదవుతున్నా, మరణాల శాతం గణనీయంగా తగ్గింది.
వైరస్ ఉత్పరివర్తనం చెందినా మరణాల శాతం తక్కువగానే ఉన్నది. దేశవ్యాప్తంగా మరణాల రేటు మూడింట ఒక వంతు తగ్గింది. మనుగడ సాగించేందుకు వైరస్లు ఉత్పరివర్తనం చెందుతాయి. ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ల విషయంలోనూ ఇది జరిగింది. ప్రస్తుత దశలో వైరస్ సోకుతున్న వారిలో యువత అధికంగా ఉండడం కూడా మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఒక కారణం కావచ్చు. అలాగే ముందటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైన చికిత్స, టీకాలు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ సుమిత్ రాయ్, ఢిల్లీ హోలీ ఫ్యామిలీ హాస్పిటల్
రాబర్ట్వాద్రాకు కరోనా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్వాద్రాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. తన భార్య ప్రియాంకకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఇద్దరూ స్వీయనిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
‘బూస్టర్ డోసు’కి సై
భారత్ బయోటెక్ ప్రతిపాదనలకు డీసీజీఐ అనుమతి
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ డోసు) క్లినికల్ ట్రయల్స్కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి అనుమతించింది. కొవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం కోసం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పులు చేయాలని భారత్ బయోటెక్ డీసీజీఐని కోరింది. సుదీర్ఘ చర్చల అనంతరం డీసీజీఐ అనుమతినిచ్చింది. 6ఎంసీజీ మోతాదుతో ప్రయోగాలు కొనసాగించవచ్చన్నది. దీంతో కొవాగ్జిన్ మూడో డోసుపై ప్రయోగాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం కరోనా టీకాను రెండు డోసులుగా ఇస్తున్నారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు శరీరంలో ఎంతకాలం ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. దీంతో మూడో డోసు ఇవ్వాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. దీన్నే ‘బూస్టర్ డోసు’గా పిలుస్తున్నారు. ఈ డోసు వల్ల శరీరంలో వైరస్కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీల జీవితకాలం మరింత పెరుగుతుంది.
ఉల్లంఘనులపై ఉక్కుపాదం!
కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధించేందుకు పోలీస్ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం వంటి వాటిని ప్రయోగించాలని సూచించింది. అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, వైద్యశాఖల కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానాలో వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉన్నదని కేంద్రం పేర్కొన్నది.
ఒక్క రోజులో 81,466 కేసులు ..
6 నెలల్లో గరిష్ఠం
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో ఇదే గరిష్ఠం. మహమ్మారి కారణంగా కొత్తగా 469 మంది మరణించారు. మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36.7 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.
పుణె జిల్లాలో లాక్డౌన్
పుణె జిల్లాలో వారంపాటు లాక్డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి ఏడురోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది. పుణె జిల్లాలో రెండురోజులుగా రోజూ 8 వేలకుపైగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు, ఎత్తైన భవంతుల్లో నివసించేవాళ్ల కన్నా మురికివాడల్లో నివసించేవారికే ఎక్కువ సామాజిక స్పృహ ఉంటుందని కరోనా కేసులతో నిరూపితమైందని మంబై మేయర్ కిశోరీ పండేకర్ అన్నారు
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు