ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్న ప్రభుత్వం
నేటి నుంచి జిల్లా ఉద్యోగుల ఖాతాల్లోకి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగా బిల్లులు సమర్పించిన ఆయాశాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్ నెల బకాయిలను ట్రెజరీ అధికారులు జమచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్యోగులందరికీ జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల జూన్ నెలలో పెరిగిన వేతనాలు జమకాలేదు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయాశాఖలకు చెందిన అధికారులు ఉద్యోగుల బిల్లులుచేసి పే అండ్ అకౌంట్స్ అధికారులకు పంపించారు. ఇప్పటివరకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగుల బకాయిలు చెల్లించారు. బుధవారంనుంచి జిల్లాల్లో ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఒకటి రెండు రోజుల్లో బకాయిల చెల్లింపులన్నీ పూర్తి కానున్నట్లు సమాచారం. జూలై వేతనాల చెల్లింపునకు సంబంధించి పెరిగిన వేతనాలతోనే వేతన బిల్లులన్నింటినీ ఆయాశాఖల అధిపతులు పే అండ్ అకౌంట్స్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. జూలై వేతనాలు కొత్త పీఆర్సీ ప్రకారమే వస్తాయి. పెన్షనర్లందరికీ జూన్ నెలలోనే పీఆర్సీతో ప్రకారం పెన్షన్ ఇచ్చారు.
టీఎన్జీవోల కృతజ్ఞతలు
జూన్ నెల వేతన బకాయిలు చెల్లించడానికి కృషిచేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ఱారావుకు టీఎన్జీవో నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత బీఆర్కే భవన్లో రామకృష్ణారావును టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ కలిశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఇహెచ్ఎస్)కు ఉద్యోగుల వాటా గా మూల వేతనం నుంచి ఒకశాతం కట్ చేయాలని కోరారు. ఉద్యోగులకు చెల్లిస్తున్న బకాయిల నుంచే ఒక్కశాతం వేతనాన్ని కట్చేసుకోవాలని కోరామని దీనికి రామకృష్ణారావు అంగీకరించారని మామిళ్ల రాజేందర్ తెలిపారు. అలాగే పీఆర్సీ రికమండేషన్ల అమలుకు సంబంధించి ఇంకా విడుదల కాని జీవోలను వెంటనే విడుదలచేయాలని కోరామని చెప్పారు. పీఆర్సీ రికమండేషన్లలో ఉన్న వ్యత్యాసాలపై చర్చించి అమలు చేయడానికివీలుగా అనామలీస్ కమిటీని వేయాలని కోరామని తెలిపారు. పీఆర్సీ జూన్ నెల బకాయిలను విడుదల చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.