ఇళ్లలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
మసీదుల వద్ద పోలీసుల బందోబస్తు
శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
బోథ్, మే 14: కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ వేడుకలను శుక్రవారం ముస్లింలు ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బోథ్, సొనాల, కౌఠ(బీ) మసీదుల్లో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అత్యంత సన్నిహితులకు భౌతిక దూరం పాటిస్తూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. బోథ్లోని జామా మసీదు వద్ద ఎస్ఐ రాజు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుడిహత్నూర్, మే 14: మండలంలోని తోషం, సీతాగొంది, మన్నూర్, డోంగర్గామ్, శాంతాపూర్, కమలాపూర్, లింగాపూర్ గ్రామాల్లో ముస్లింలు ఇళ్లలోనే నమాజ్ చదివారు. అనంతరం కుటుంబ సభ్యులతో వేడుకలు చేసున్నారు.
ఇంద్రవెల్లి, మే 14: మండల కేంద్రంతో పాటు హీరాపూర్, కెస్లాగూడ(ఎం), ముత్నూర్, ధనోరా(బీ), ధనోరా(కే), శంకర్గూడ, గలియాబాయితండా గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు రంజాన్ వేడుకులు జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నుంచి సమస్త మానవాళి బయట పడాలని అల్లాను ప్రార్థించారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ముస్లింలకు ఫోన్ ద్వారానే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఎండీ మసూద్, షేక్ సుఫియాన్, అమ్జద్, జిలానీబేగ్, యాకూబ్ బేగ్ పాల్గొన్నారు.
నార్నూర్, మే 14: నార్నూర్, గాదిగూడ మండలాల్లో ముస్లింలు ఉదయం వేళలోఇంటి వద్దనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఉట్నూర్/ సిరికొండ/ ఇచ్చోడ, మే 14: ఉట్నూర్, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఇళ్లల్లోనే నమాజ్ చేశారు. ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భీంపూర్, మే 14: మండలంలోని కరంజి(టీ), అంతర్గాం, అర్లి(టీ), ధనోరా, గోనా, తాంసి(కే) గ్రామాల్లో ముస్లింలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేశారు. గోనాలో డాక్టర్ మన్సూర్ అహ్మద్, జహూర్ అహ్మద్, బాదర్, తాంసి(కే)లో సర్పంచ్ కరీం నమాజ్లో పాల్గొన్నారు.