హైదరాబాద్ : వ్యక్తిగత కారణాలతో స్విట్జర్లాండ్ వెళ్తూ పాక్లో పట్టుబడి నాలుగేళ్ల జైలు జీవితం గడిపిన ప్రశాంత్ను సోమవారం వాఘా సరిహద్దులో భారత భద్రతా దళాలకు పాక్ రేంజర్స్ అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ప్రశాంత్ను మాదాపూర్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇవాళ సీపీ సజ్జనార్ సమక్షంలో ప్రశాంత్ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రశాంత్ ఐటీ ఉద్యోగిగా జీవిస్తున్న సమయంలో.. ఆయనకు వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. దీంతో స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నాననే ఆలోచనతో, నడిచిపోవాలనే ఉద్దేశంతో 2017, ఏప్రిల్ 11న హైదరాబాద్ నుంచి రైలులో రాజస్థాన్ బికనీర్ వెళ్లారు. అక్కడ ఒక రోజు బస చేసిన తర్వాత.. ఇండో – పాక్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను దూకి, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో ప్రశాంత్ను పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీసా, పాస్పోర్టు లేని కారణంగా ప్రశాంత్పై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. శిక్ష పూర్తయిన తర్వాత నిన్న జైలు నుంచి విడుదల చేసిన పాక్ అధికారులు.. వాఘా సరిహద్దులో భారత భద్రతా బలగాలకు ప్రశాంత్ను అప్పగించారు. ప్రశాంత్ నాలుగేండ్ల శిక్ష అనుభవించాడు. ప్రశాంత్ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
పాక్ జైలు నుంచి విడుదలైన ప్రశాంత్.. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశాడు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల చొరవ వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగాను అని పేర్కొన్నాడు. తన సమస్యను భారత్ – పాక్ మధ్య సమస్యగా చూడకూడదు అని విజ్ఞప్తి చేశాడు. రెండు దేశాల్లోనూ మంచి వారు, చెడ్డవారు ఉన్నారు. పాక్ జైల్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నాను. హిందీ నేర్చుకున్నాను. అక్కడి జైల్లో భారతీయులతో పని చేయించరు. జైల్లో భారతీయుల కోసం ప్రత్యేక గదులు ఉండేవి.
తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయి. తాను వెళ్లే ముందు మా అమ్మ ఆపేందుకు ప్రయత్నించింది. అమ్మ మాట విననందుకు నాలుగేండ్లు కుటుంబానికి దూరమయ్యాను. అసలు తిరిగి వస్తానని అనుకోలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉంది అని ప్రశాంత్ పేర్కొన్నాడు.
ప్రేమలో ఉండి స్విట్జర్లాండ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని ప్రశాంత్ తెలిపాడు. అయితే స్విట్జర్లాండ్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా మార్గం తెలుసుకున్నాను. రాజస్థాన్ వయా పాకిస్తాన్ మీదుగా 61 రోజుల్లో స్విట్జర్లాండ్ వెళ్లొచ్చు అని తెలుసుకున్నాను. అప్పుడు ప్రేమలో ఉన్నాను కాబట్టి.. అలా చేయాల్సి వచ్చిందని ప్రశాంత్ పేర్కొన్నాడు.