ఇది సెకండ్ వేవ్ కాదు.. సునామీ
దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధత ఏమిటి?: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునేవారిని ఉరితీస్తామని హెచ్చరించింది. ప్రాణవాయువు కొరతపై ఢిల్లీలోని వివిధ దవాఖానలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖాపల్లితో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. తక్కువ రోగ నిరోధకత ఉన్నవారికే కరోనా ప్రాణాంతకం అని, అయితే ప్రాణాలు రక్షించగలిగే అవకాశం ఉన్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐఐటీ కాన్పూర్ అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ దేశంలో మే మధ్య నాటికి సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుతుందని పేర్కొన్నది. ‘మనం దీనిని వేవ్ అంటున్నాం కానీ.. ఇది సునామీ’ అని వ్యాఖ్యానించింది. దీనికి కేంద్రం ఎలా సన్నద్ధమవుతున్నదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 26లోగా నివేదికివ్వాలని ఆదేశించింది. రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, కానీ ప్రస్తుతం రోజుకు 300 మెట్రిక్ టన్నులే సరఫరా చేస్తున్నదని ఢిల్లీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎప్పటిలోగా 400 మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రయోజనిక్ ట్యాంకర్లను ఢిల్లీ ప్రభుత్వం అందివ్వకపోవడమే కారణమని కేంద్రం తెలిపింది.