ఉభయ జిల్లాల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి
ఉమ్మడి జిల్లాలో వంద శాతం డంపింగ్ యార్డులు పూర్తి
వైకుంఠధామాల నిర్మాణంలో నిజామాబాద్ జిల్లాకు మూడోస్థానం
నెలాఖరులోగా పెండింగ్ పనులు పూర్తిచేసేలా కార్యాచరణ
ప్రగతి పనుల్లో పోటీపడుతున్న
ఉభయ జిల్లాల యంత్రాంగం
నిజామాబాద్, మార్చి 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైకుంఠధామాలు, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డులు, నర్సరీలు, ప్రకృతివనాలు.. ఇలా కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధితో పల్లె ముఖచిత్రం మారుతోంది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని సఫలం చేయడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాయి. ఉభయ జిల్లాల్లోనూ వందశాతం డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. ఇక వైకుంఠధామాల నిర్మాణంలో 96శాతం లక్ష్యాన్ని చేరుకుని నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచింది. పల్లె ప్రగతి నిర్దేశిత లక్ష్యాల్లో అలసత్వానికి అవకాశం లేకుండా అధికారుల నిరంతర పర్యవేక్షణ మెరుగైన ఫలితాలను రాబట్టింది. పెండింగ్ పనులను కూడా నెలాఖరులోగా పూర్తిచేసేలా రెండు జిల్లాల అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
గ్రామాల అభివృద్ధిని కాంక్షించి పనులు చేపట్టిన సందర్భాలు గతంలో చాలా తక్కువ. పంచాయతీలకు నిధుల లేమి మూలంగా చెత్తాచెదారం, మురికినీటి శుద్ధి, తాగునీటి సౌకర్యం వంటి కనీస సౌ కర్యాల కల్పన కూడా కలగా మిగిలేది. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన అనంతరం పల్లెల్లో సమూల మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్ర త్యేక దృష్టితో ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా పంచాయతీ రాజ్ చట్టం తీసుకు వచ్చారు. చట్టంలో పొందుపర్చిన పలు కీలకమైన అంశాలతో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు అధికారాలు కల్పించారు. నిర్లక్ష్యం వహించినా కొరడా ఝుళిపించే అవకాశం కూడా ఇందులో పొందుపరిచారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఈ చట్టం బాధ్యతలను రెట్టింపు చేసింది. తద్వారా గ్రామాలకు విడుదలవుతున్న నిధులతో అధికార యంత్రాంగంతో కలిసి స్థాని క ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలను సర్వాంగ సుం దరంగా ముస్తాబు చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా అద్భుతంగా అమలు చేస్తుండడంతో గ్రామాలు అద్దంలా మెరుస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ నిధులను నెలవారీగా విడుదల చేస్తుండడంతో గ్రామాలన్నీ ఆర్థిక పరిపుష్టితో కళకళలాడుతున్నాయి.
వంద శాతం డంపింగ్ యార్డులు పూర్తి…
గ్రామాల్లో గతంలో చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేవారు. ఇప్పుడు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్టు షెడ్లు నిర్మించి ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. చెత్తతొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. హరితహారంలో మొక్కలను తీసుకెళ్లడానికి, నాటిన వాటికి నీళ్లు పెట్టడానికి వీటిని వినియోగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా.. 529 గ్రామాల్లో కంపోస్టు షెడ్డు నిర్మాణాలను పూర్తి చేయడంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. డంపింగ్ యార్డుల నిర్మాణాల్లో నిజామాబాద్ 8వ స్థానం దక్కించుకుంది. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు గాను 521 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు పూర్తయ్యాయి. 99శాతం మేర పనులు పూర్తి కావడంతో రాష్ట్ర స్థాయిలో కామారెడ్డికి 15వ స్థానం దక్కింది.
వైకుంఠధామాల్లో టాప్..
శ్మశాన వాటికల రూపు మారింది. అత్యాధునిక హంగులతో వైకుంఠధామాల నిర్మాణానికి సర్కారు పనులు మొదలు పెట్టడంతో పాటు నిర్మాణాలను పూర్తి చేసింది. వైకుంఠధామాల నిర్మాణాల్లో సంగారెడ్డి, నిర్మల్ జిల్లా తర్వాత నిజామాబాద్ జిల్లా నిలిచింది. 530 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మించాల్సి ఉండగా… జిల్లా యంత్రాంగం 529 చోట్ల పనులు ప్రారంభించి 510 వైకుంఠధామాలను నేటి వరకు పూర్తి చేసింది. వైకుంఠధామాలన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 96శాతం మేర వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ద్వారా టాప్ 3లో జిల్లా స్థానం పదిలమైంది. కామారెడ్డి జిల్లా ఇందులో కాసింత వెనుకబడింది. 526 జీపీలకు గాను 525 చోట్ల శ్మశానవాటికల నిర్మాణాలు ప్రారంభం కాగా… ఇందులో 362 చోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం నిత్యం పర్యవేక్షిస్తుండడంతో పాటు నిర్లక్ష్యం వహించిన చోట్ల ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటుండడంతో పనుల్లో వేగం పెరిగింది.
గ్రామం యూనిట్గా పల్లె ప్రగతి..
పల్లెప్రగతి కార్యక్రమంతో భాగంగా విరివిగా మొక్కలు పెంచి జీవవైవిధ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల లక్ష్యం నెరవేరబోతున్నది. ప్రతి గ్రామంలో దాదాపు ఎకరానికిపైగా స్థలంలో వీటిని ఏర్పాటు చేసి వివిధ రకాల నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కల పెంపకంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి వనంలో తిరగడానికి వీలుగా వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, విద్యుత్ దీపాలు, నీటి వసతి కల్పించారు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతిని ఆస్వాదించేందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో శ్మశానవాటికల నిర్మాణాలు జోరందుకున్నాయి. దహన సంస్కారాల ప్లాట్ ఫారం, స్నానాల గదులు, నీటి సౌకర్యం, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సదుపాయం కల్పించారు.