హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పాటరీ యంత్రాలను మంజూరుచేసింది. వీరితోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లంతకుంట, వీణవంక, జమ్మికుంట మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ఆధునిక కుండల బట్టీలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆదివారం బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆధునిక యంత్రాల ద్వారా వివిధ డిజైన్లలో మట్టిపాత్రలు, కూజాలు, వాటర్బాటిళ్లు, టీ కప్పులు, మట్టి విగ్రహాలు, దీపపు కుండీలు, ఇతర అలంకరణ సామగ్రిని అత్యంత వేగంగా తయారుచేయడానికి వీలవుతుంది. ఆధునిక పాటరీ యంత్రాల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇందులో రూ.80 వేలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మిగిలిన రూ.20 వేలను తమ వాటాగా ఇప్పటికే లబ్ధిదారులు జమచేశారు.