హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు మరో హరిత పండుగకు వేదికకానున్నది. ఒకే రోజు ఒకేగంటలో ముక్కోటి వృక్షార్చనతో సరికొత్త రికార్డు దిశగా అడుగుపడనున్నది. ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఒక్క గంట వ్యవధిలో మూడుకోట్ల మొక్కలతో పుడమి తల్లి మురిసిపోనున్నది. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం జరుగనున్నది. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం బ్రోచర్ను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్.. మంత్రులు మహమూద్అలీ, జీ జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టినరోజున ముక్కోటి వృక్షార్చనను నిర్వహించడాన్ని చాలెంజ్గా తీసుకుంటున్నామని ఎంపీ సంతోష్కుమార్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహించిన కోటి వృక్షార్చన మాదిరిగానే.. ఈ మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి కేటీఆర్ పుట్టిన రోజున నిర్వహించే హరితపండగ వేదికవుతుందని బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులను ఎంపీ కే కేశవరావు అభినందించారు.