హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రధానమైన కూరగాయల్లో ఆలుగడ్డ ఒకటి. మిగతా కూరగాయలతో పోల్చితే ఈ పంటకు కచ్చితమైన ధర ఉండటంతోపాటు రైతుకు ఏడాదిపాటు ఆదాయం లభిస్తుంది. రాష్ట్రంలో ఆలుగడ్డ సాగు ఆశించినస్థాయిలో లేదు. కేవలం 5 వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది. ఏటా సగటున ఒక వ్యక్తి 6.24 కిలోల ఆలుగడ్డ తినాలి. ఈ లెక్కన మన రాష్ర్టానికి 2.04 లక్షల టన్నుల ఆలుగడ్డ అవసరం. కానీ మన వద్ద పండుతున్నది కేవలం 47 వేల టన్నులు మాత్రమే. ఈ లోటును భర్తీ చేసేందుకు మరో 15 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేయాల్సిన అవసరం ఉన్నదని ఉద్యానశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మాత్రమే ఈ పంటను సాగుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలుగడ్డ సాగుకు మంచి అవకాశాలున్నాయని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ (సీపీఆర్ఐ) తెలిపింది. ఆలు సాగులో అధిక దిగుబడులు తెచ్చేందుకు సీపీఆర్పై 5 నూతన వంగడాలను ఆవిష్కరించింది.
కుఫ్రీ మోహన్, కుఫ్రీ సూర్యా, కుఫ్రీ గంగా, కుఫ్రీ ఫుక్రాజ్, కుఫ్రీ హిమాలిని రకాలు మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ విత్తన గడ్డను అందించేందుకు పరిశోధన సంస్థ సిద్ధంగా ఉన్నదని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 120కి పైగా క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నదని వివరించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగు అనివార్యం అయిన నేపథ్యంలో రైతులు ఆలు సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. సాగులో మెళకువలు, విధానాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు.