హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాలవారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించారు. సమాజంలో, ఉద్యోగరంగాల్లో చోటుచేసుకొంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన అవసరమని, ఇందుకోసం కొత్త పోస్టులను సృష్టించాల్సిన అవసరం ఉన్నదని క్యాబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో కాలంచెల్లిన పోస్టులు అవసరంలేదని.. ఉద్యోగ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి, జిల్లాలు, విభాగాలవారీగా సంకలనం చేయాలని సూచించింది. బుధవారం నాటి మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను క్యాబినెట్ ముందుంచారు. ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్య, వివిధ క్యాటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అందించారు.
ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజన పూర్తి
ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యే రాష్ర్టానికి రప్పించామని క్యాబినెట్ తెలిపింది. ఇంకా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రానుంచి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఖాళీలు సహా, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకొని, మిగిలిన ఖాళీలను సత్వరమే గుర్తించి క్యాబినెట్ సబ్కమిటీకి నివేదిక అందించాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది.