హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాసులో పాసైనా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజని దశ తిరిగింది. ఆమె కష్టాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా నియమిస్తూ సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రజని ప్రగతిభవన్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ రజని కథ
ఆ చదువుల తల్లి ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాసులో పాసై పీహెచ్డీ చేద్దామని అనుకుంటుంటే పెద్దలు పెండ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. అటు చదువులో ముందుకు సాగుదామనుకుంటే కుదరలేదు. ఇటు ఉద్యోగ ప్రయత్నాలూ కలిసిరాలేదు. దానికి తోడు భర్త అనారోగ్యంతో సంసార బాధ్యతలు మీదపడ్డాయి. పిల్లలను బడిలో చదివించాలన్నా డబ్బులకు ఇబ్బంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె స్వీపరు ఉద్యోగంలో చేరారు. క్లుప్తంగా ఇదీ రజని కథ. అంచెలంచెలుగా చదువు లో ఎదుగుతూ అధ్యాపకుల ప్రశంసలు అందుకున్న రజనికి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ అర్హత కూడా వచ్చింది. కానీ కుటుంబ భారం ఆపేసింది. భర్తకు చిన్న వయసులోనే గుండెజబ్బు రావడం, స్టెంట్లు వేయడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
రజని ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదు. మాల్స్ వంటివాటిలో రోజువారీ పని వెతుక్కుందామన్నా కరోనా కల్లోలంతో అదీ కుదరలేదు. చివరకు పదివేల జీతానికి కాంట్రాక్టు స్వీపరు ఉద్యోగంలో చేరారు. అందులో రెండు వేలకు పైగా రాకపోకలకే ఖర్చవుతుంది. ఆమె నిస్సహాయ పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆమె విద్యార్హతలకు అనుగుణంగా ఆమె స్వీపరుగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీలోనే అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఉద్యోగం ఇప్పించారు.