అందోల్, అక్టోబర్ 12 : పోరాటాల పురిటిగడ్డ సంగారెడ్డి జిల్లా అందోల్కు అరుదైన గౌరవం దక్కనున్నది. అందోల్లో పుట్టి.. తన ఉద్యమాలనే వేదికలుగా మలిచి ఢిల్లీ వరకు ప్రస్థానాన్ని సాగించిన ప్రముఖ ఉర్దూ కవి మఖ్దూం మొహియొద్దీన్ తెలంగాణ సాయుధ పోరాటం లో నిజాంకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన స్మారకార్థం రూపొందించిన భారత పోస్టల్ కవర్ను తపాలా అధికారులు బుధవారం అందోల్లో విడుదల చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా (ఇప్పుడు సంగారెడ్డి జిల్లా) అందోల్ గ్రామంలో 1908లో జన్మించిన మఖ్దూం మొహియొద్దీన్ 1946-50 మధ్య కాలంలో హైదరాబాద్లో నిజామ్కు వ్యతిరేకంగా గళం విప్పారు. విలేకరిగా నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. కవితలతోనూ ప్రజలను చైతన్యవంతులను చేశారు. 1969లో ఆయన ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై మొహియొద్దీన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.