సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): మావోయిస్టు కీలకనేత ఆర్కే భద్రతగా ఉంటున్న ఇద్దరు మావోయిస్టుల ఇంటికి శనివారం రాచకొండ పోలీసులు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను కలిశారు. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న అల్వాల్ చంద్రహాస్ అలియాస్ పాండు, అలియాస్ ప్రమోద్, అలియాస్ చంద్రన్న, పల్లె పాటి రాధ అలియాస్ నీల్సో కుటుంబాలను మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, స్థానిక ఇన్స్పెక్టర్ భిక్షపతితో కలిసి.. వారు నివాసముంటున్న జవహర్నగర్లోని ఇంటికి వెళ్లి మాట్లాడారు. గత 35 ఏండ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న చంద్రహాస్, నాలుగేండ్లుగా అజ్ఞాతంలో ఉన్న రాధను తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు కృషి చేయాలని పోలీసులు వారికి సూచించారు.
తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, ఫ్రెండ్లీ పోలీసింగ్తో వారు జనంలో కలవడానికి వస్తే ఇబ్బందులు ఉండవని, వారికి పునరావాసం కల్పిస్తామని డీసీపీ హామీ ఇచ్చారు. కరోనాతో తలెత్తుతున్న అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా మావోయిస్టు పార్టీని విడిచిపెట్టేలా చూడాలని అధికారులు కుటుంబ సభ్యులను కోరారు. కుటుంబ సభ్యులు కూడా.. మా వాళ్లు వచ్చి సాధారణంగా జీవిస్తే చాలా సంతోషమని చెప్పారు. మాకు కూడా వారిని చూడాలని ఉందని పోలీసు అధికారులకు వివరించారు. అనంతరం డీసీపీ, ఏసీపీ.. ఇరు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులను అందించారు. ఈ ఇద్దరు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కమిటీలో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పల్లెపాటి రాధ ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తూ నాలుగేండ్ల కిందట మావోయిస్టు పార్టీలోకి వెళ్లిందని, ఇక చంద్రహాస్ 35ఏండ్ల కిందటే వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చంద్రహాస్ వయస్సు 51, రాధ వయస్సు 24 ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.