హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ యాత్రను నగరంలోని మాసాబ్ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం నుండి ఆ శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నింగి, నీరు, నేల కాలుష్యమైన చోట ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ఊపిరి నిచ్చేది, ఆయువు పెంచేది, ఔషధాన్నిచ్చేది వృక్షం (చెట్టు). మనిషి మనుగడకు ఆదేరువు (చెట్టు) వృక్షం. అలాంటి ప్రకృతి సంపదపై ప్రజలు చిన్న చూపును ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల శాతం గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థతుల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం “హరితహారం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లెలను, పట్టణాలను పచ్చని, చల్లని వణంలా మారుస్తుందన్నారు.
గౌరీశంకర్ సైకిల్యాత్రను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్తో పాటు అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, డీడీ హస్మీ, ఐ&పీఆర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఎఫ్డీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, రాష్ట్ర టీఎన్జీవో సంఘం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది.
గౌరీశంకర్ ప్రజా “హరిత హారం” ఆరు విడుతలలో ఆరు సంవత్సారాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశంలోని 29 రాష్ట్రాలలో 729 జిల్లాలో హరితహారం సైకిల్ యాత్ర విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గౌరీశంకర్ కడు నిరుపేద. ఇల్లు వాకిలి లేనివాడు. అయినా సమాజం కోసం, రాష్ట్రం కోసం ఏదో ఒకటి మంచి పని చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, మిత్రులు, ప్రజల చేయుతతో అలుపెరుగని బాటసారిగా సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నారు.