హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి. కొవిడ్ నేపథ్యంలో సంబురాలు నిరాడంబరంగానే జరిగా యి. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, విప్ బాల్క సుమన్, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కిశోర్గౌడ్ బాణసంచా పేల్చి,మిఠాయిలు పంచారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురే లేదని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానంలేదని సాగర్ ఉపఎన్నికల ఫలితాలు రుజువుచేశాయని నేతలు పేర్కొన్నారు. సోమవారం జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటిగ్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు.