ఎండల్ల ఎగువ మానేరులో నీళ్లు చూడటమంటే ఎండమావిలో నీళ్లు పట్టుకున్నట్టే.. ఇది ఒకప్పటి మాట మరిప్పుడు.. నడిఎండాకాలంలో ఎగువ మానేరు నిండడమే కాదు రేపో మాపో మత్తడి కూడా దుంకనున్నది. రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ కాల్వ ద్వారా కూడవెల్లి వాగుగుండా తరలివచ్చిన గోదారి నీళ్లతో ఎగువమానేరు నిండుగా నిండింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో శనివారం డ్రోన్తో తీసిన ప్రాజెక్టు చిత్రమిది.
వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ధర్మారావు పల్లెలో మైసమ్మకుంట ఉంది. ఏటా ఏప్రిల్లో ఇది పూర్తిగా ఎండిపోతుంది. ఈసారి గోదావరి జలాలతో చెరువును నింపారు. దీంతో ఆ పక్కనే ఉన్న పెద్దబావి ఊటలు ఊరి ఇలా కనువిందు చేసింది.
గుండాల కృష్ణ, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధిఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఈశాన్యంలో నీళ్లుంటే వాస్తుకు మంచిదంటారు! అందుకే కాళేశ్వరుడి నెత్తిన గంగ తెలంగాణపై అనుగ్రహం చూపినట్టుంది. తెలంగాణ గడ్డపై నిలకడ తెలియని గంగమ్మ వేల చెక్డ్యాంలను జల భాండాగారాలుగా మార్చింది.. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణలో ప్రతి ఇంచు భూమి పచ్చిదనాన్ని నింపుకొని పచ్చదనంతో కళకళలాడుతున్నది. నిన్నటిదాకా ఒక్క టీఎంసీకి ముఖం వాసిన తెలంగాణ సిగలో ఇప్పుడు నిండు వేసవిలోనూ వందల టీఎంసీల నీటి నిల్వలతో ఎటు చూసినా జల దృశ్యామే ఆవిష్కృతమైంది. సమైక్య పాలనలో చెక్డ్యామ్ల విషయంలో నిర్లక్ష్యం చూపితే.. స్వరాష్ట్రంలో వాటికి మహర్దశ పట్టింది. ఇది ఒక్క రోజులో సాధ్యంకాలేదు. దశాబ్దాల కిందటే పురుడుపోసుకున్న స్వప్నం.. ఈ ఏడేండ్లలో ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ తెలంగాణ రైతు బతుకుల్లో జీవం పోసే జల సౌధంలా రూపుదిద్దుకుంది. మొత్తంగా ఇప్పుడు జల రక్షణలో ఉన్నది. నిండు నీటితో రిజర్వాయర్లు, అవి వదిలిన నీటితో కిలోమీటర్ల కొద్దీ కాలువలు, వాటి నుంచి మత్తళ్లు దుంకుతున్న వేల చెరువులు.. చెరువులు, సోయగాల వాగులు, వంకలు.. ఎన్నెన్నో! రేపటి రోజున ఒక్క చినుకు పడితే చెరువు చిందేస్తుంది. వాన పడితే.. వాగు పొంగుతుంది. నదికి వచ్చిన చిన్న వరద.. రిజర్వాయర్లను నింపుతుంది.. మార్గమధ్యంలో వేల చెక్డ్యామ్లకు ప్రాణం పోస్తుంది. ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుతోనైతేనేమి.. వేగంగా పూర్తవుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతోనైతేనేమి.. అనేక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చనున్నాయి. నదీమ తల్లుల ఆశీర్వాదంతో భావి తెలంగాణ ఉజ్వల రాష్ట్రంగా అవతరించబోతున్నది!
కాల్వలు, చెరువుల అనుసంధానంతో నూతన అధ్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద చెరువులను నింపడం అనేది ఒక నేరం. సాగునీటి గోసతో రైతులు కాల్వలకు గండ్లు పెట్టి.. వ్యవసాయం చేసుకోవడంతోపాటు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధం కావాల్సి వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు కాల్వలతో చెరువుల అనుసంధానం అనేది నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇది ఇప్పటి ఆలోచన కాదు. తెలంగాణ ఏర్పడిన ఆదిలోనే మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువులను అనుసంధానించారు. రైతుల ప్రమేయం లేకుండానే.. ప్రాజెక్టుల పరిధిలోని ప్రతి చెరువుకు నీరందేలా తెలంగాణ ప్రభుత్వమే ప్రాజెక్టుల కాల్వలపై 4500 తూములను ఏర్పాటు చేసింది. అందుకే నిండు వేసవిలోనూ తెలంగాణలో వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడుతున్నది. కృష్ణా, గోదావరి బేసిన్లలో దాదాపు 45 వేల చెరువులు ఉండగా.. 40 డిగ్రీల సెల్సియస్ ఎండల్లోనూ ఇప్పటికిప్పుడు వేల చెరువులు మత్తడి దుంకుతున్న దృశ్యాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవంటే అతిశయోక్తి కాదేమో. వర్షాకాలంలో వానల ద్వారా చెరువులు నిండితే.. మిగిలిన సమయాల్లో ప్రతి చెరువు నిండుకుండలా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల ద్వారా మొదటి ప్రాధాన్యం కింద చెరువులను నింపుతున్నది. తద్వారా ఏడాది పొడవునా చెరువులు జల భాండాగారాలుగా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం జల వనరుల శాఖకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశం.
వాగులకు పునరుజ్జీవం
ఒక్కో అంచెగా తెలంగాణ జలదృశ్యాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్న ప్రభుత్వం చెరువుల తర్వాత వాగుల పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టింది. భారీ ప్రాజెక్టుల ద్వారా చెరువులు, ఆపై వచ్చే పడవాటి (రీజనరేటెడ్ వాటర్) నీళ్లను సైతం ఒడిసిపట్టేందుకు ఈ బృహత్తర ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి, 1250 చోట్ల చెక్డ్యాంలను నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రూ.4వేల కోట్లతో జలవనరుల శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పాలనా ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా గతేడాది మొదటి దశగా 610 చెక్డ్యాంల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఈ జూన్లోగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి, మిగిలిన చెక్డ్యాంల నిర్మాణాన్ని రెండో దశ కింద అక్టోబరు-నవంబరు నెలల్లో ప్రారంభించనున్నారు. దీంతోవాగులు, వంకలు సైతం ఏడాది పొడవునా సజీవ జల దృశ్యాలకు వేదికలు కానున్నాయి.
చివరి భూములకు మోక్షం
దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టుల కింద మొన్నటిదాకా సాగునీటికి నోచుకోని చివరి భూములు (టెయిల్ ఎండ్) లక్షల ఎకరాల్లో ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అంచెలంచెలుగా ఆవిష్కరిస్తున్న జల దృశ్యాల్లో భాగంగా వీటికీ శాశ్వతంగా మోక్షాన్ని కల్పించింది. కాల్వల ఆధునీకరణతో చివరి భూముల వరకు సాగునీరు సాఫీగా అందేలా చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, గత ఏడాది ప్రతి సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని చెరువుల్ని ఆధునీకరించింది. తద్వారా ఒకవైపు స్థానిక ప్రజలకు ఉపాధి లభించడంతోపాటు సాగునీటి జలాల సద్వినియోగం కూడా సాధ్యమైంది. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా వినియోగించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
1300 టీఎంసీలు వాడుకొని తీరుతం
తెలంగాణ రాష్ట్రం అయిందే మా హక్కు మేం సాధించుకోవడానికి. తెలంగాణ రాష్టం అయిందే మా కరువును తరిమి వేసుకోవడానికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చడానికి. ఆరు నూరైనా సరే.. ఏది ఏమైనా సరే.. పిడుగులు పడ్డా సరే.. భూకంపాలు వచ్చిన సరే.. సమైక్య రాష్ట్రంలోనే కృష్ణ, గోదావరిలో కలిపి మనకు అధికారికంగా కేటాయించిన 1300 పైచిలుకు టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకొని తీరుతుంది. కచ్చితంగా ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయి. ఎవరు కూడా దీనిని ఆపలేరు. ఆపే పిచ్చి ప్రయత్నాలు ఏవైనా ఉంటే మానుకోవాలి. అనవసరమైన పిచ్చి ఆలోచనలకు పోవద్దు.
ఏ ప్రాజెక్టుతో ఏ ప్రాంతానికి మేలు?
కాళేశ్వరం పథకం.. కాలగర్భంలో కలిసిపోతాయనుకున్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు ఊపిరిలూదింది.
తుపాకులగూడెం బరాజ్ ద్వారా దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. జూరాలతో పాటు కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా నీటి లభ్యత పెరగనున్నది. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నల్లగొండ జిల్లాలోనూ 50వేల ఎకరాల వరకు భూములు ఈ ప్రాజెక్టు నీటితో పచ్చదనాన్ని నింపుకోనున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారానే నీటి లభ్యతను పొందనున్న డిండి ఎత్తిపోతల పథకంతో దశాబ్దాలుగా ఫ్లోరైడ్తో మగ్గిపోతున్న నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాయి.
సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామం కానున్నది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు భూములకు సైతం అవసరమైతే గోదావరిజలాలను అందించేందుకూ తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రాణహిత, చనాకా-కొర్టాతో పాటు అనేక మధ్యతరహా ప్రాజెక్టులతో ఆదిలాబాద్ జిల్లా భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి.
చెరువుల్లో నీటి నిల్వ
మొత్తం చెరువులు – 43412
మత్తడి దుంకుతున్నవి – 250
75-100%ం నిండుగా ఉన్నవి – 31,376
50-75 శాతం నిండుగా ఉన్నవి – 8,807
25-50 శాతం నిండుగా ఉన్నవి – 2,112
0-25 శాతం నిండుగా ఉన్నవి – 867
చెక్డ్యామే జీవధార
మల్లన్న సాగర్ తెలంగాణ జల భాండాగారం. మల్లన్నసాగర్లో కొన్ని ఊళ్లు మునిగిపోయాయనే బాధ ఉన్నప్పటికీ యావత్ తెలంగాణ కోసం వారు త్యాగం చేయక తప్పలేదు. తెలంగాణ వారిని ఎప్పటికీ మర్చిపోదు. మల్లన్న సాగర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కసారి అది పూర్తయితే జల చిత్రంలో విప్లవాత్మక మార్పులు ఖాయం. అందువల్ల ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికివారే ఒక కేసీఆర్గా మారి.. తమ ప్రాంతాల్లో చెక్డ్యామ్లను సత్వరమే నిర్మించుకోవాలి. మే నెలాఖరుకల్లా కొత్త చెక్డ్యాముల నిర్మాణం, పాత వాటి మరమ్మతులు ముగించాలి. తద్వారా తమ తమ ప్రాంతాల్లో నీటి వసతిని భూగర్భ జలాలను పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్
ఎందరో వచ్చిపోయారు, కానీ..
ఎన్నో పార్టీల నాయకులు వచ్చారు.. పోయారు. కానీ హల్దీవాగులోకి నీళ్లను మళ్లించిన నాయకుడే కరువయ్యారు. ఎండిపోతున్న పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నం. మా మొర ఎవ్వరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సారు రైతులు పడుతున్న కష్టాలను చూసి హల్దీవాగులోకి గోదారమ్మను పంపించారు. ఎవుసం చేసుకుంటున్న మాలాంటి రైతులకు ఇకనుంచి పండుగే.
-బాబుల్రెడ్డి, యావాపూర్, మెదక్ జిల్లా
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
ఎవుసానికి నీళ్లులేక మా భూములు ఏడారిగా మారాయి. హల్దీవాగులోకి నీళ్లు ఇవ్వాలని గతంలో ఎవరినీ కోరినా పట్టించుకోలే. కొండపోచమ్మసాగర్ నుంచి మా గ్రామానికి హల్దీ జలాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-యాంజాల లక్ష్మి, యావాపూర్, మం:తూప్రాన్, మెదక్ జిల్లా
మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సారు
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హల్దీవాగులోకి నీళ్లను తీసుకొచ్చి ఎండిపోతున్న పొలాలకు నీళ్లిస్తున్నారు. వ్యవసాయం మీదనే ఆధారపడిన మా కుటుంబానికి ఎంతో లాభం జరుగుతుంది.
-వరలక్ష్మి, వెంకటరత్నాపూర్, మం: తూప్రాన్, మెదక్ జిల్లా
రెండు పంటలు పండిస్తా..
సీఎం కేసీఆర్ చలవతో హల్దీవాగులోకి నీళ్లొచ్చాయి. మా గ్రామానికి ఆనుకొని ఉన్న వెంకటరత్నాపూర్ చెక్డ్యాం నిండింది. పొలంలోని బోర్లలో నీరు బాగా వస్తుంది. ఎండిపోయిన చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా లభిస్తుంది. ఏడాదికి రెండు పంటలు పండిస్తా.
-రాజిరెడ్డి, గుండ్రెడ్డిపల్లి, మం: తూప్రాన్, మెదక్ జిల్లా
రైతులు రాజులుగా మారుతారు..
హల్దీవాగులోని నీళ్లతో ఎడాదిపొడవునా పంటలు పండించుకుంటం. ఇక నుంచి ఎవుసం మీదనే ఎక్కువ దృష్టి పెడుతా. ఏ ఇతర పనులకు ఇకపై వెళ్లం. కేసీఆర్ పుణ్యాన రైతులు రాజులుగా మారతారు.
-సురేందర్రెడ్డి, యావాపూర్, మం: తూప్రాన్, మెదక్ జిల్లా
పంటలకు ఢోకా లేదు..
కొండపోచమ్మ సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి గోదావరి నీటిని విడుదల చేయడంతో యాసంగి సీజన్లో రైతులు వేసిన పం టలకు ఢోకా లేదు. గత పాలకులు సీఎం కేసీఆర్లాగా ఆలోచిస్తే మా బతుకులు ఎప్పుడో మారిపోయేవి.
-మద్దెల ఆంజనేయులు, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
నీరిచ్చిన ఘనత కేసీఆర్దే..
70 ఏండ్ల కాలంలో యాసంగిలో వరికి నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కూడవెల్లి వాగులోకి గోదావరి జలా లు రావడంతో.. ఎండుముఖం పట్టిన వరికి నేడు జీవం వచ్చింది. కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కుమ్మరి చంద్రం, రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
కేసీఆర్ సారు చెర్వులు నింపిండు
గిర్మాపురంలో మాకు రెండెకరాలుంది. ఇన్నాళ్లు ఆనలు వడితేనే పంటలు పండేవి. సీఎం కేసీఆర్ సారు యాడికెళ్లో కాలువల నుంచి నీళ్లు తీసుకొచ్చి చెర్వులు నింపిండు. ధర్మా యి చెర్వు నిండి అలుగు పారుతున్నది.
-లావూరి లక్ష్మి, మహిళా రైతు, గిర్మాపూర్, సిద్దిపేట జిల్లా
జీవాలను బతికించిండు..
రెండేండ్ల కింద గొర్రెలిచ్చి బతుకుదెరువు సూపిండు కేసీఆర్ సారు. ఇయ్యాల పెద్ద చెరు వు నింపి జీవాలకు ఆసర అయిండు. కట్టమీది పోషమ్మకు కోడినిగోసి కల్లుసాక పెట్టి, జీవాలను సల్లంగా ఉంచుమని మొక్కిన.
-బొమ్మ పాపయ్య, గొర్రెల కాపరి, గుంటిపల్లి, సిద్దిపేట జిల్లా
చెర్వు నింపి మేలుజేసిండు సారు
నా శిన్నగున్నప్పటి నుంచి సూడని సోద్యం ఇయ్యాల సూస్తున్న. బంధం చెర్వు నింపిన సర్కారోళ్లు సల్లంగుండ. మంచి పనిజెసిర్రు. మా ఆయన కాలం చేసిండు. పింఛన్ ఇచ్చి అన్నం పెట్టిండు కేసీఆర్ సారు. చెర్వు నింపి ఊరందరికి ఉపకారం జేసిండు ఆ సారు.
-పోతగల్ల నర్సవ్వ, రైతు కూలీ, చౌదర్పల్లి, సిద్దిపేట జిల్లా
చెర్వు నిండగానే బలమొచ్చింది..
పెద్దచెర్వు నిండగానే బలమొచ్చింది. ఊరంతా పండుగోలే అనిపించింది. చెర్ల నీళ్లున్నాయంటే ఇంట్ల బియ్యం ఉన్నట్టు లెక్క. ఊరు సెర్వు నిండిందంటే వొచ్చిన సుట్టపోళ్లకు కూడా సౌలత్ ఉంటది. ఇప్పుడు పెద్ద సెర్వెనుక గుంటభూమిగూడా బీడుందది. నీళ్లు తీసుకొచ్చిన సీఎం సార్కు దండాలు.