ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో రాష్ట్రం, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం కాలుష్యరహితంగా మారిందని ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బోటనీ విభాగాల మాజీ హెడ్ ప్రొఫెసర్ సీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా భారీస్థాయిలో మొక్కలు పెంచడం, చెరువులు, కుంటలు సహా నీటివనరుల పరిరక్షణతో పర్యావరణం పదిలంగా ఉన్నదని ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం టెన్ పాయింట్ వింటర్ ప్లాన్ను ప్రవేశపెట్టిందని, కోటిన్నర జనాభాతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ఎన్నో పరిశ్రమలు ఉన్నప్పటికీ కాలుష్యం తక్కువగా ఉండటానికి సీఎం కేసీఆర్ కృషే కారణమని కొనియాడారు. మొక్కలు నాటడంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. హరితహారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం హరితనిధిని ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇండ్లల్లో స్వచ్ఛమైన గాలి కోసం అక్వేరియం ఏర్పాటుచేసి, ఆ నీటిలో సున్నం కలిపి బయట నుంచి గాలి వచ్చేలా చేస్తే గాలిలోని వ్యర్థాలు నీటిలో కలిసిపోయి శుద్ధమైన గాలి లభిస్తుందని తెలిపారు. గార్డెన్లలో సున్నం కలిపిన నీటిని పిచికారీ చేసినా కాలుష్యం తగ్గుముఖం పడుతుందని సూచించారు.