హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ నెల 27వ తేదీలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తికావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శనివారం ఆయన ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ పూర్తిచేయడంతోపాటు.. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లలో లోపాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పోలింగ్ లొకేషన్లో ఏఎన్ఎం, ఆశ వరర్, హెల్త్వరర్లను నియమించాలని, మాసు ధరించిన వారినే అనుమతించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం వెలుపల, లోపలా భౌతికదూరం పాటించేలా చూడాలని, పోలింగ్, పోలీసు సిబ్బందికి మాస్, ఫేస్షీల్డు, శానిటైజర్, చేతిగ్లౌజులు అందించాలని ఆదేశించారు.
27న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం
సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించేందుకు అనుమతించరాదని ఎస్ఈసీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. 27న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ నిబంధనలను అతిక్రమించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ, అదనపు డీజీపీ జితేందర్, ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి, ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.