అర్హులంతా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి
25 నిండినా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం
మంత్రి ఈటల రాజేందర్
చిక్కడపల్లి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రాదని అనుకున్నామని, కానీ వైరస్ విజృభిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అయినప్పటికీ వైరస్ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లుచేశామని తెలిపారు. స్వీయ జాగ్రత్త పాటించడమే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. కరోనా వ్యాక్సిన్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘కొవిడ్ 19 వ్యాక్సిన్ -నిజాలు’ పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ.. టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, అర్హులంతా తప్పక వేసుకోవాలని సూచించారు. టీకా వేసుకొంటే వేరే అనారోగ్యాలు చుట్టుముడుతాయని జరుగుతున్న ప్ర చారం అబద్ధమని స్పష్టంచేశారు. 25 ఏండ్లు దాటినవారందరికీ టీకా వేసేందు కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి కోరినట్టు చెప్పారు. ఇతర దేశాల్లో కంటే మన దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని, అందులో రాష్ట్రంలో చాలా స్వల్పంగా ఉన్నదని వివరించారు. తకార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు విజయ్కుమార్ ఎల్దంది, వేదిక ప్రతినిధి డీజీ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.