వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ
పోలీస్ అధికారులు, సిబ్బందితో జూమ్ మీటింగ్
ఆర్ఐ ఆఫీస్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
వికారాబాద్, మే 8, (నమస్తే తెలంగాణ): కరోనా సోకితే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ సూచించారు. శనివారం తన కార్యాలయం నుంచి పోలీస్ అధికారులు, కరోనా వచ్చిన పోలీస్ సిబ్బందితో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. విధిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు తప్పకుండా డాక్టర్ సలహాల మేరకే మందులు వాడాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను అనుసరించవద్దన్నారు. సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. యోగా, ప్రాణాయామం లాంటి శ్వాసకు సంబంధించిన వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వెలుతురు ఎక్కువగా వచ్చే గదిలో ఉండాలన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోలీస్ అధికారులకు గానీ, మెడికల్ అధికారులకు ఫోన్ చేయాలన్నారు. పోలీస్స్టేషన్ అధికారులు పోలీస్ సిబ్బంది యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ రశీద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఐ ఆఫీస్ను ప్రారంభం..
వికారాబాద్ జిల్లా ఏఆర్ హెడ్ కార్టర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఐ ఆఫీస్ను జిల్లా ఎస్పీ నారాయణ శనివారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1500 చదరపు అడుగుల స్థలంలో రూ.30లక్షలతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రశీద్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.