ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి బెంగాల్ ఫలితాల తర్వాత ఆందోళన తప్పదని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్థిరంగా ఉండలేదని జోస్యం చెప్పారు.
“మే 2 (ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల) తరువాత మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు జరుగుతాయని వాదించే (బీజేపీ) వారు ఢిల్లీలో కూడా ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలి” అని శివసేన అధికార పత్రిక సామ్నా కాలమ్లో సంజయ్ రౌత్ పేర్కొన్నారు. బెంగాల్లో మమత గెలిస్తే, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రచారానికి నేతృత్వం వహించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగతంగా ఓటమి చెందినట్లేనని ఎద్దేవా చేశారు.
“మహారాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఆధారపడి ఉందని చెప్పుకునే వారు స్వర్గంలో విహరించే మూర్ఖులు. అమిత్ షా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడంపై దృష్టి పెడతారని కొంత మంది ఏ ప్రాతిపదికన చెబుతున్నారో అన్నదని ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు తమ డబ్బు, అధికార బలంతో మహారాష్ట్రలోని అధికార పార్టీ శాసన సభ్యులను లొంగదీసుకోవచ్చు లేదా కరోనాను నియంత్రించడంతో మా వైఫల్యాన్ని చూపుతూ రాష్ట్రపతి పాలన విధించవచ్చు” అని పేర్కొన్నారు.
ఒకవేళ కరోనాను కారణంగా చూపితే.. కేంద్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు బీజేపీకి ఉండదని సంజయ్ రౌత్ విమర్శించారు. దేశంలో ఆక్సిజన్, ఔషధాల కొరతతో ఐదు వేల మందికిపైగా మరణించినప్పుడు అలాంటి రాజకీయాలను వారు ఎలా చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఒక్క బెంగాల్లో గెలిచేందుకు యావత్ దేశాన్ని ముప్పులో పడేశారని, సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు.