ఖమ్మం: గులాబ్ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉండటంతో రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.