భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరీక్షల కంటే విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమైనవన్నారు’. ఈ మేరకు పరీక్షలు రద్దు చేయాలని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీహెచ్ఎస్ఈ)ను ఆదేశించారు. ఇప్పటికే బీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. గతేడాది పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షలకుపైగా విద్యార్థులు, సీహెచ్ఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు ఆరు లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కేంద్రం సైతం సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి.