మెహిదీపట్నం : తల్లిదండ్రులు వృద్ధులు కాగానే వారి ఆలనా పాలనను పిల్లలు పట్టించుకోవడం లేదు. వీలైతే వృద్ధాశ్రమాల్లో చేర్చుతూ నెలనెలా ఖర్చులు కూడా లెక్క కడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లి యాదిలో సమాజానికి ఉపయోగపడే విధంగా లంగర్హౌస్ సంగం బాపూఘాట్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో శౌచాలయంను నిర్మించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బాపూఘాట్ సమీపంలోని త్రివేణి సంగమంలో అస్తికలు, పిండ ప్రదానం, కర్మకాండల నిమిత్తం అనేక మంది వస్తుంటారు. అయితే ఇక్కడ మహిళల శౌచాలయం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన కారింగుల శ్రీనివాస్ గౌడ్ తన తల్లి జ్ఞాపకార్థం శౌచాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల పనులు పూర్తి కావడంతో తల్లి రంగమణి గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తండ్రి కారింగుల అమరలింగం గౌడ్ (రిటైర్డ్ పోలీస్) చేతుల మీదుగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చాడు. దీంతో శ్మశాన వాటికకు వచ్చేవారు శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కారింగుల గోపిగౌడ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.