హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/వేములవాడ రూరల్ : నకిలీ విత్తన సరఫరా ముఠాలపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ నకిలీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. ఈ సీజన్లో ఇప్పటికే 311 కేసులు నమోదు చేయగా.. పోలీసులు 446 మందిని అరెస్టు చేశారు. సీఎం ఆదేశాలతో ఏడుగురిపై పీడీ యాక్ట్ నమోదుచేశారు. నలుగురు విత్తన డీలర్ల లైసెన్స్లను రద్దుచేశారు. నకిలీ విత్తనాలపై గత ఏడేండ్లలో 515 కేసులు నమోదు కాగా.. ఈ ఒక్క సీజన్లోనే 311 కేసులు ఉండటాన్ని బట్టి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుండడమే అదనుగా నకిలీ విత్తన ముఠాలు రెచ్చిపోతున్నాయి. పత్తి, మిరప పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతుండటంతో ఆ రెండు విత్తనాలను ఎక్కువగా నకిలీవి అమ్ముతున్నారు. ఇందులో నిషేధిత హెచ్టీ కాటన్ విత్తనాలు అధికంగా ఉన్నాయి. 59 ప్రాంతాల్లో విత్తన నమూనాలను పరిశీలించగా ఇందులో నాలుగు ప్రాంతాల్లో హెచ్టీ కాటన్ను గుర్తించారు. 6 కోట్ల విలువైన 949 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేయగా.. రూ.80.73 కోట్ల విలువైన విత్తనాల విక్రయాన్ని నిలిపివేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో 50 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకొన్నట్టు వేములవాడ రూరల్ ఎస్ఐ బన్సీలాల్ తెలిపారు.
ఆ ప్రాంతాలే అడ్డాగా
సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండటంతో నకిలీ విత్తన ముఠాలు తెలంగాణపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఈ ముఠాలు ఏపీలోని గుంటూరు, కర్నూలు, రాయచూరు, మహారాష్ట్ర, గుజరాత్లోని పలు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని ఈ దందాకు తెగబడుతున్నట్టు తెలుస్తున్నది. విత్తనాలను ఆయా ప్రాంతాల్లోనే ప్యాకింగ్ చేసి.. ఇక్కడ ఏజెంట్లద్వారా విక్రయాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతుండటం ఇందుకు నిదర్శనం. హెచ్టీ కాటన్ విత్తనాలు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
నకిలీలను ఉపేక్షించేది లేదు
రైతులకు నష్టం చేకూర్చే నకిలీ విత్తనాల సరఫరాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సీఎం కేసీఆర్ ఆదేశంతో నకిలీ ముఠాలపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నాం. భవిష్యత్లో మరింత పక్కాగా తనిఖీలు చేపడుతాం. అసలు నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండానే అడ్డుకుంటాం..ఇందుకోసం ఫిబ్రవరి నెలలోనే విత్తన ఉత్పత్తి సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రత్యేక నిఘా పెడుతాం.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖమంత్రి