మనది సర్వసత్తాక ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ప్రజలే ప్రభువులంటారు. కారణం- ప్రజల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతాయి. అవి రాజ్యాంగ స్ఫూర్తితో, మౌలిక సూత్రాలకు కట్టుబడి చట్టాలను అమలుపరచాలి. పరిపాలన అనేది దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా, స్వావలంబన సాధించేలా ఉండాలి. కానీ కాలక్రమేణా ప్రజాస్వామిక స్ఫూర్తి అడుగంటుతూ, వ్యక్తిగత పోకడలతో నియంతృత్వ ధోరణికి బాటలు పడుతున్నాయి.
నరేంద్రమోదీ 2014 ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. అందులో ఎన్ని అమలయ్యాయి.. ఎందుకు అమలుకాలేదనే సమీక్ష లేదు. మోదీకి ఆత్మవిమర్శ అసలే లేదు. వాగ్దానాలకు భిన్నంగా పాలన సాగిస్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలాంటివి అమలుపరిచారు. 2019లో మూడింట రెండొంతుల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. పార్టీ ఫిరాయింపులకు ద్వారాలు తెరవడం; ఎదురుతిరిగినవారిని, తమ తప్పులను వేలెత్తి చూపినవారిని ఈడీ దాడులు, సీబీఐ విచారణల వంటి మార్గాల ద్వారా బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం నిరసన, ప్రతిపక్షాలు లేని నియంతృత్వ పాలన కొనసాగించాలనుకుంటున్నారు.ఇదివరలో ప్రభుత్వాలు దేశ స్వావలంబనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుండటం దారుణం. కొవిడ్ కారణంగా లాక్డౌన్తో ప్రజలు ఇండ్లలోనే బందీలై అతలాకుతలమవుతుంటే, బీజేపీ ప్రభుత్వం ఇదే అదునుగా ప్రైవేటీకరణ విధానాలను వేగంగా అమలుచేసుకుంటూ పోయింది. వ్యవసాయ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా కార్పొరేటీకరణ చేయ సంకల్పించడం ముమ్మాటికీ తిరోగమనమే. వ్యవసాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పొట్టపోసుకుంటున్న జనాభాలో 60శాతం పైబడి బతుకుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. అందుకే మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. హక్కులను హరిస్తూ, కూలీలుగా, జీతగాళ్లుగా మారే దుస్థితి ఉంది కాబట్టే, చావో, రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వరంగ సంస్థలు కేవలం ఉద్యోగాల కల్పన కోసం ఏర్పడినవి కాదు. అవి సమాజహితం కోసం ఆవిర్భవించిన యావత్ దేశ ప్రజల ఆస్తులు. ప్రధాని మోదీ బాజాప్తా ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటామని ప్రకటించడం ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ప్రభుత్వ పని వ్యాపారం కాదని, అది వేరేవాళ్లు చేస్తారని, వంద పీఎస్యూలను ప్రైవేటీకరించడం ద్వారా రూ.2.50 లక్షల కోట్లు సమీకరిస్తామని విచిత్రమైన వాదన ముందుకు తీసుకువచ్చారు. జాతి సంపద అయినటువంటి ఆ ప్రభుత్వ రంగ సంస్థలున్న భూముల విలువే అంతకంటే ఎన్నో రెట్లు ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మార్కెట్ విలువ రూ.2లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా. కానీ దానికి ప్రభుత్వం కట్టిన విలువ రూ.5వేల కోట్లే. పీఎస్యూల ద్వారా దేశానికి కావాల్సిన ఉపకరణాలను మనమే తక్కువ ధరకే తయారుచేసుకోగలుగుతాం. వాటికి కావాల్సిన ముడిసరుకును, మార్కెటింగ్, సిబ్బందిని కల్పిస్తే, రూ.2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లాభాలే వస్తాయి. అలాకాకుండా వాటిని అగ్గువకే తెగనమ్మడమంటే బంగారు బాతును కోసుకొని తినడం కూడా కాదు.. ఆశ్రిత కార్పొరేట్ మిత్రులకు నిస్సిగ్గుగా బంగారు పళ్లెంలో పెట్టి అందించడమే.
ఎవరైనా అమ్ముకునేందుకు కంపెనీ నష్టాల్లో ఉన్నదనే సాకు చెప్పడం సాధారణం. కాని మోదీ ప్రభుత్వం మాత్రం- లాభాల్లో ఉంటేనే కదా ఎవరైనా కొనేది అనే కొత్త సూత్రీకరణ చేస్తున్నది. ఇప్పటివరకు నష్టాల్లో లేని, ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా సాయం చేస్తూ వచ్చిన ఎల్ఐసీలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74 శాతానికి పెంచడం దేనికి నిదర్శనం? విదేశీ శక్తుల పెత్తనం కిందకు నెట్టడం ఎలాంటి స్వపరిపాలన, స్వదేశభక్తి అవుతుందో చెప్పాలి. లాభాలలో ఉన్న రైల్వే, విద్యుత్, ఉక్కు, బీఎస్ఎన్ఎల్, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం, స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అప్పగించడమేమిటి? బ్యాంకుల విలీనం కూడా ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ల గుప్పిట్లో ఉంచడానికి పథకం ప్రకారం చేసినట్టుంది. మొండి బకాయిల పేరుతో రూ.8లక్షల కోట్లను మాఫీ చేయడం కార్పొరేట్ల అప్పుల ఎగవేతకు అండదండలు అందించడమే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్న సందర్భంగా అమృత మహోత్సవ్ నిర్వహించాలని కేంద్రం తలపెట్టింది. వాస్తవానికి స్వావలంబనను దెబ్బతీస్తూ, దేశాన్ని ప్రైవేటుకు అప్పగిస్తూ స్వాతంత్య్ర ఆకాంక్షలను సమాధి చేస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తెరగాలి. పన్నుల మోత, వ్యవసాయ, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపంలో నిరసించాలి. ప్రజా వ్యతిరేక వైఖరి అవలంబించే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి.
సామాన్య ప్రజల పైన పన్నుల మోతకు హద్దులు లేకుండా పోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. దీంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆత్మనిర్భర భారత్ అంటే అర్థమేమిటి? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమా? ప్రజల బతుకులను ఛిద్రం చేయడమా? ఏడేండ్ల మోదీ పాలనలో ఎన్ని కోట్ల ఉద్యోగాలొచ్చాయి.. పేదరికం పెరిగిందా, తగ్గిందా?.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్న సందర్భంగా అమృత మహోత్సవ్ నిర్వహించాలని కేంద్రం తలపెట్టింది. వాస్తవానికి స్వావలంబనను దెబ్బతీస్తూ, దేశాన్ని ప్రైవేటుకు అప్పగిస్తూ స్వాతంత్య్ర ఆకాంక్షలను సమాధి చేస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తెరగాలి. పన్నుల మోత, వ్యవసాయ, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపంలో నిరసించాలి. ప్రజా వ్యతిరేక వైఖరి అవలంబించే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి.
(వ్యాసకర్త:చాడ వెంకటరెడ్డి , రాష్ట్ర సీపీఐ కార్యదర్శి )