హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు, అభూతకల్పనల ప్రచారంలో తామెంతటి ఘటికులమో బీజేపీ మరోసారి నిరూపించుకుంటున్నది. ఏకంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొనేందుకు నానా అవస్థలు పడుతున్నది. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించి, సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించిన కేసీఆర్ కిట్ల పథకం తమదేనంటూ బీజేపీ అసత్య ప్రచారాలకు పూనుకొంటున్నది. రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ వల్లనే ఈ పథకం వచ్చిందని, కేసీఆర్ కిట్ల ద్వారా ఇస్తున్న సొమ్ములో రూ.ఆరువేలు కేంద్రమే ఇస్తున్నదని తప్పుడు ప్రచారం చేస్తూ, తన వక్రబుద్ధిని, అల్పబుద్ధిని చాటుకుంటున్నది.
ఒక్క పైసా ఇవ్వలేదు
సీఎం కేసీఆర్ 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం దేశానికే రోల్మోడల్గా మారింది. అన్ని రాష్ట్రాలు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాయి. గర్భిణులకు 16 రకాల వస్తువులతో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకున్న బాలింతలకు మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందజేస్తున్నది. ఈ పథకానికయ్యే మొత్తం ఖర్చును రాష్ట్రమే భరిస్తున్నది. దీనికి కేంద్రం నయా పైసా కూడా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల గత ఏడేండ్లలో 12.15 లక్షల మంది లబ్ధిపొందారు. వారికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.1,020 కోట్ల నగదు సాయం అందింది. రూ.190 కోట్లతో 9.20 లక్షల హెల్త్ అండ్ హైజీన్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.
పీఎం మాతృత్వ వందన యోజనలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు
అయితే, కేంద్రం ప్రభుత్వం కూడా గర్భిణుల కోసం పీఎం మాతృత్వ వందన యోజన ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మూడు విడతల్లో రూ.5 వేలు అందజేస్తుంది. ఈ నిధుల్లో కేంద్రం 60%, రాష్ర్టాలు 40% భరించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ పథకం కింద తెలంగాణకు రూపాయి కూడా విడుదలచేయలేదని పార్లమెంట్లో స్వయంగా బీజేపీ మంత్రులే వెల్లడించారు. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇలా ప్రచారానికి దిగడం విస్మయం కలిగిస్తున్నది. ఆ మాటకొస్తే పీఎం మాతృత్వ వందన యోజన కూడా బీజేపీది కాదు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన పేరుతో ఒక పథకం ప్రారంభించింది. 2017లో కేంద్రం పీఎం మాతృత్వ వందన యోజన పథకంగా పేరు మార్చింది.
కేసీఆర్ కిట్ వంద శాతం రాష్ట్రానిదే: అసెంబ్లీలో ఈటల రాజేందర్
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకం వల్ల దవాఖానల్లో కాన్పులు పెరిగాయి. రాష్ట్రంలో మాతృత్వ మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి.. ఇది వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పథకం..’ ఇది అసెంబ్లీలో మంత్రి హోదాలో ఈటల అనేకసార్లు చెప్పిన మాట. ఇది కేంద్ర పథకం అంటూ అప్పట్లో బీజేపీ నాయకులు చేసిన ప్రచారాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగానే తిప్పికొట్టారు. నాడు తమ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టిన ఈటల ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారన్న విషయాన్ని కూడా మరచిపోయిన బీజేపీ నేతలు మరోసారి తమ అల్పబుద్ధిని ప్రదర్శిస్తున్నారు.