అందుబాటులోకి వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్
చెరువు పక్కనే పల్లెప్రకృతి వనం
మౌలిక సదుపాయాలతో స్థానికుల హర్షం
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధి వేగవంతమైంది. దీంతో పల్లెలు, తండాల రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు చెత్తాచెదారం, మురుగు కాల్వలతో కనిపించే వీధులు నేడు అద్దంలా మెరుస్తున్నాయి. పార్కులకు నోచుకోని చోట నేడు పల్లెప్రకృతివనాలతో కనువిందు చేస్తున్నాయి. చివరి మజిలీకి నానా ఇబ్బందులు పడిన చోట వైకుంఠధామాల నిర్మాణంతో ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
జనగామ రూరల్, జూలై 11 : పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. ఇందుకు నిదర్శనమే మండలంలోని పసరమడ్ల గ్రామం. ఒకప్పుడు తాగునీటి కోసం గోసపడే ఈ ప్రాంతం ‘మిషన్ భగీరథ’తో దాహార్తి తీరింది. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం అందుతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామంలో పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటయ్యాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతుండడంతో పసరమడ్ల గ్రామం నేడు ఆకుపచ్చగా మారింది. సుమారు 1,700 మంది జనాభాతో ఉన్న గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీకి నేరుగా నిధులు వస్తుండడంతో స్థానికంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. వైకుంఠధామం కోసం రూ.9 లక్షలు, సెగ్రిగేషన్ షెడ్కు రూ.2.15 లక్షలు మంజూరవడంతో వీటిని నిర్మించారు. సెగ్రిగేషన్ షెడ్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. మరోవైపు నర్సరీలో 19 వేల మొక్కలు పెంచుతున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది వేల మొక్కలను ఖాళీ స్థలా ల్లో, ప్రధాన రహదారుల్లో నాటారు. వీటిని సంరక్షించేందుకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో గ్రామం ఆహ్లాదకరంగా మారింది.
చెరువు పక్కనే పల్లెప్రకృతివనం
పసరమడ్ల గ్రామంలోని చెరువు పక్కనే ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం వివిధ రకాల మొక్కలతో కనువిందు చేస్తున్నది. పక్కనే వైకుంఠ ధామం ఉండడంతో హరితహారంలో భాగంగా అక్కడ మొక్కలు నాటారు. చుట్టూ పూ లు, నీడనిచ్చే మొక్కలు నాటి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో సరైన ప్రణాళిక లేక అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం నేడు పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఆకుపచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా మారి స్థానికులకు ఉత్సాహాన్నిస్తున్నది.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నం..
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా గ్రామస్తుల సహకారంతో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నం. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రజలు సైతం అభివృద్ధి పనుల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారం తీసుకుంటున్నం. వారి చేయూతతో అభివృద్ధి పనులు చేపడుతున్నం.
-శివరాతి స్వప్నరాజు, పసరమడ్ల గ్రామ సర్పంచ్