బడంగ్పేట, ఏప్రిల్ 28: మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కొవిడ్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, మహేశ్వరం, జల్పల్లిలో కొవిడ్ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేస్తారని అన్నారు. బాలాపూర్ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తారని తెలిపారు. కొవిడ్పై అవగాహన కల్పించేందుకు వైద్యాధికారిని నియమించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామన్నారు. జల్పల్లిలో ఏర్పాటు చేసే కొవిడ్ కేంద్రానికి భవనాన్ని సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా , కమిషనర్ ప్రవీణ్కుమార్, వైద్యాధికారి నర్సింగ్ రావు, కౌన్సిలర్లు ఉన్నారు.