హైదరాబాద్ : కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.
ఇక మహారాష్ర్టకు అనుకొని ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఏ ఆపదొచ్చినా తెలంగాణ ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ఎవరూ భయాందోళనకు గురికావొద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.