ఇప్పుడంటే ఉదయాన్నే రకరకాల టిఫిన్లు, సాయంత్రం కాగానే స్నాక్స్ అంటూ ఏవోవో లాగించేస్తున్నారు కానీ, ఒకప్పుడు మూడు పూటలు అన్నమే తినేవాళ్లు. అది కూడా మధ్యాహ్నం ఎక్కువ, రాత్రిపూట తక్కువ అని కాదు.. మూడు పూటలా పుష్టిగా తినేవాళ్లు. ఆ రోజుల్లో బలవర్థకమైన ఆహారం తీసుకునేవాళ్లు, శారీరక శ్రమ కూడా ఆ స్థాయిలోనే ఉండేది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోక తప్పదంటున్నారు నేటి ఆహార నిపుణులు. ముఖ్యంగా మూడు పూటలా అన్నమే తినడం శరీరానికి మంచిది కాదంటున్నారు. ఇందుకు కారణమేంటో తెలుసుకుందాం..
శరరీంలో నీరు లేదా ద్రవం నిలుపుదల అనేది ఎక్కువ అవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో, కణజాలాలలో వాపుకు కారణమవుతుంది. నిజానికి మానవ శరీరంలో 70 శాతం వరకు నీరు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ నీరు ఎక్కువ నిలిచినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో 70శాతం కంటే ఎక్కువ నీరు నిలిచిపోయి ఉండటానికి వ్యాయామం లేకపోవడం, విటమిన్ లోపాలు, అధిక రక్తపోటు, అలెర్జీలు, గుండె సమస్య లాంటి అనేక కారణాలున్నాయి. వీటితో పాటు అన్నం ఎక్కువ సార్లు తినడం కూడా శరీరంలో నీటిని నిలిపి ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఉన్నవారు మూడు పూటల అన్నం తినకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఉదాహరణకు..
– ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం
– ఔషధాలకు ప్రతిచర్య(మందులు వేసుకుంటే అలర్జీ లాంటి సమస్యలు వచ్చే లక్షణాలు)
– పోషకాహార లోపం
– హార్మోన్ల అసమతుల్యత
– అధిక ఉప్పు ఉండే ఆహారం తీసుకోవడం
– థైరాయిడ్, ఆర్థరైటిస్, అనారోగ్య సిరలు వంటి వ్యాధులు
– కాలేయం , మూత్రపిండాల లోపాలు
– మహిళల్లో మెనోపాజ్
– కాలేయం, మూత్రపిండాల లోపాలు
– అధికంగా మద్యం సేవించడం
నీరు నిలుపుదలకు అన్నం ఎలా కారణమవుతుందంటే బియ్యంలో అధిక మొత్తంలో పిండి పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో నీరు నిలిచిపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఫలితంగా.. శరీరం ఎక్కువ సోడియంను నిలుపుకుంటుంది. వీటితో పాటు ప్రాసెస్ చేసిన చక్కెరలు, తెలుపు పిండి కూడా నీటి నిలుపుదలకు దోహదపడతాయి.
నివారణ ఏంటి అంటే..
అన్నం అలవాటుగా మారిన వారు, దాన్ని తినకుండా ఉంటే ఆహారం విషయంలో తృప్తి పొందని వారు ఉంటారు. వారు తెల్ల బియ్యానికి బదులుగా, బ్రౌన్ రైస్ లేదా ఎర్ర బియ్యం ఎంచుకుని వాటితో తయారు చేసుకున్న అన్నం తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తృణధాన్యాలు శరీరం నుండి అదనపు నీటిని బయటకు పంపిస్తాయి. అంతేకాదు.. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.