అందాల పోటీలంటే కుబేరులకు సంబంధించిన విషయమని అనుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఆటోవాలా తన కూతురు అందాల కిరీటం గెలువాలని కలలు కన్నాడు. అయితే, ఒక్క అడుగు దూరంలో కిరీటం చేజారినా దేశ ప్రజల మనసులను గెలిచింది ‘వీఎల్సీసీ మిస్ ఇండియా’ పోటీల్లో రన్నరప్గా నిలిచిన మన్యా సింగ్. మన్యా తండ్రి ఓం ప్రకాశ్ సింగ్ ఆటో డ్రైవర్. తల్లి ఇంటి పనిచేస్తూ.. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకొనేది. ‘నా కోసం నాన్న, అమ్మ, తమ్ముడు పడిన కష్టాలు మరువలేను. వారి సహకారం వల్లనే నేనీస్థాయిలో ఉన్నా’ అని అందాల పోటీ స్టేజీమీది నుంచే తన కుటుంబ త్యాగాల్ని సగర్వంగా లోకానికి చాటింది మన్యా. ఈ మధ్యే స్వగ్రామం హటాలో తనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆడపిల్లలు గొప్పగొప్ప కలలు కనాలి. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి. ఏ దశలోనూ రాజీ పడకూడదు. నా కుటుంబానికి, గ్రామానికి జాతీయస్థాయిలో పేరు తెచ్చినందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అంటూ ఉద్వేగానికి లోనైంది మన్యా సింగ్