హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్రోడ్డు వెలుపలికి తరలించాలన్న ప్రభుత్వ సంకల్పం వేగంగా కార్యరూపం దాల్చుతున్నది. కాటేదాన్లోని ఆయిల్ మిల్లులను బూచినెల్లికి.. రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో గల ప్లాస్టిక్ పరిశ్రమలను తుమ్మలూరుకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం టీఎస్ఐఐసీ స్థలాలను కేటాయించడంతో వాటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తుది నోటీసులు జారీచేశాయి. హైదరాబాద్లోని కాలుష్యకారక పరిశ్రమలను మూడేండ్లలోగా ఔటర్ రింగ్రోడ్డు వెలుపలికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. శాస్త్రిపురంలో జనావాసాల మధ్య ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతుండటంతో వాటిని అక్కడి నుంచి తరలించాలని న్యాయస్థానం గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ పరిశ్రమలను తుమ్మలూరు ప్లాస్టిక్ పార్కుకు తరలించాలని అధికారులు నిర్ణయించి వాటి నిర్వాహకులకు పలు దఫాలుగా నోటీసులు జారీచేశారు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ కొందరు తమ పరిశ్రమలను తరలించేందుకు నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు టీఎస్ఐఐసీ అధికారులు ఆయా ప్లాస్టిక్ పరిశ్రమల నిర్వాహకులతో చర్చించి తుమ్మలూరులో తగిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, కాలుష్యకారక ప్లాస్టిక్ పరిశ్రమలను తుమ్మలూరుకు తరలించించాల్సిదేనని స్పష్టంచేస్తూ పీసీబీ, జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవలే తుది నోటీసులు జారీ చేయడంతో వాటిని తరలించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
ప్లాస్టిక్ పార్కు నేపథ్యం ఇదీ..
ప్లాస్టిక్ పరిశ్రమలన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయించేందుకు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పార్కును అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాస్టిక్ పార్కు పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ మోదీ సర్కార్ నుంచి ఎలాంటి గ్రాంటు మంజూరు కాలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పార్కును నెలకొల్పారు. రూ.123.34 కోట్ల అంచనాతో 143 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో ప్రత్యక్షంగా 2 వేలమందికి, పరోక్షంగా మరో 3 వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ పార్కులో మొత్తం 138 ప్లాట్లను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే 50 ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. 30,235 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుచేసిన 14 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఔత్సాహికులు ముందుకొస్తే నిర్ణీత ధర ప్రకారం వారికి స్థలాలు కేటాయిస్తామని చెప్పారు.