హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుదారుల కంటిపాప (ఐరిస్) స్కానింగ్ చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతున్నదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఐరిస్ స్కానింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. కరోనా వ్యాప్తి నివారణకు ఏమేం చర్యలు చేపట్టారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 22కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
హైదరాబాద్ నగర శివారులోని శాస్త్రిపురం, టాటానగర్ ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమల సమస్యను 80 శాతం వరకు పరిష్కరించామని రాష్ట్ర హైకోర్టుకు జీహెచ్ఎంసీ తెలిపింది. కాలుష్యకారక పరిశ్రమలను వేరే ప్రాంతాలకు తరలించడం లేదా మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మూసేయాలని నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ న్యాయవాది పీ కృష్ణారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది పుష్పేందర్ కౌర్ కూడా హైకోర్టుకు చెప్పారు. మరో 20 శాతం కాలుష్యకారక పరిశ్రమలు బోర్డులు తీసేసి రాత్రిళ్లు నడుపుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం.. రాత్రిళ్లు నడుస్తున్న కాలుష్య పరిశ్రమల వివరాలను నివేదించాలని పిటిషర్ను ఆదేశించారు.