న్యూఢిల్లీ: మెటర్నిటీ బెనిఫిట్ చట్టం (1961)లోని ఒక నిబంధన వివక్షాపూరితంగా, సంకుచితంగా ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. చట్టంలోని సెక్షన్ 5(4) మూడుమాసాల లోపు పసిపాపను చట్టబద్ధంగా దత్తత తీసుకునే మహిళకు మాత్రమే మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని సూచించే నిబంధన రాజ్యాంగ బద్ధతను కర్ణాటకకు చెందిన పిటిషనర్ హంసానందిని నండూరి సవాల్ చేశారు. న్యాయమూర్తులు ఎస్ఏ నజీర్, కృష్ణమురారితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశంపై అభిప్రాయం తెలుపాల్సిందిగా ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. మూడుమాసాలు దాటిన అనాథల దత్తతపై ఆ సెక్షన్ వివక్ష చూపుతున్నదని పిటిషనర్ పేర్కొన్నారు. పైగా దత్తత తీసుకున్న తల్లులకు 12 వారాలు, గర్భం దాల్చి బిడ్డను కన్న తల్లులకు 26 వారాలు సెలవు ఇవ్వాలన్న నిబంధన నిర్హేతుకంగా, బాల న్యాయ చట్టానికి విరుద్ధంగా ఉందని తెలిపారు.