హైదరాబాద్: ప్రకృతికి మన అవసరం కంటే.. మనకే ప్రకృతి అవసరం ఎక్కువని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునఃనిర్వచించడానికి ఇదే సరైన సమయమని సూచించారు. లేకపోతే భవిష్యత్లో గాలి, నీరు దొరకని పరిస్థుతులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవాలంటే మొదట భూగ్రహాన్ని రక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సమృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. భూమిపై కనీసం 33 శాతం అటవీ ప్రాంతం ఉంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్ఫూర్తిగా నిలవాలని ఆయన సూచించారు.