పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అఖండ విజయం
టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టంగట్టిన గ్రాడ్యుయేట్స్
ఎలిమినేషన్ రౌండ్స్లో వరించిన విజయం
తొలి ప్రాధాన్య ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యం
సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు
ఈ విజయంపట్టభద్రులు, టీఆర్ఎస్ సైనికులది
నల్లగొండ ప్రతినిధి, మార్చి 20(నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండోసారి గెలవడం సంతోషంగా ఉంది. ఈ విజయం పట్టభద్రులు, టీఆర్ఎస్ సైనికులది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తూ పట్టభద్రులు నాకు మద్దతుగా నిలిచారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లను కూడా త్వరగా ఇచ్చేలా నా వంతు కృషి చేస్తా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాను. నల్లగొండ, ఖమ్మంలో ఐటీ హబ్లు ఏర్పాటుచేయడంతోపాటు వరంగల్కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేలా కృషి చేస్తాను.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టభద్రులు మరోసారి జై కొట్టారు. నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డిని రెండోసారి శాసనమండలికి ఎన్నికయ్యారు.. నల్లగొండలోని స్టేల్ వేర్ హౌసింగ్ గోదాములో జరిగిన ఓట్ల లెక్కింపులో భాగంగా తొలి ప్రాధాన్యత లెక్కింపులోనే పల్లాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ గెలుపు కోటా దాటకపోవడంతో కౌంటింగ్ అధికారులు ఎలిమినేషన్ పద్ధతిలో తదుపరి ఓట్లను లెక్కించారు. సుమారు 90 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాంతం ఆసక్తికరంగా సాగింది.
ఎలిమినేషన్ రౌండ్స్లో ఖరారు
ఈ నెల 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో 3,87,969 ఓట్లు పోలవ్వగా తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే పల్లా 27,550 ఓట్ల ఆధిక్యాన్ని కలిగిఉన్నారు. మొత్తం చెల్లిన ఓట్లలో సగం.. అంటే 18,3167 మేజిక్ ఫిగర్కు ఆయన దూరంగా ఉండటంతో కౌంటింగ్ అధికారులు ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి మొదలుపెట్టి చివరకు ఒక్కరు మిగిలే వరకు ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. శనివారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపులో చివరకు 1,61,811 ఓట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నారు. 12,806 ఓట్ల మెజార్టీని సాధించారు. రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి.
90 గంటల పాటు ప్రక్రియ..
59 మంది స్వతంత్రులుగా బరిలో నిలిచి కేవలం 5,966 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. కానీ ఎలిమినేషన్ రౌండ్స్లో మాత్రం 20 గంటల సమయం వారి కోసమే వెచ్చించాల్సి రావడం విశేషం. మొత్తం ఓట్లలో చెల్లని ఓట్ల శాతం 5.4గా నమోదైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ శనివారం రాత్రి వరకు కొనసాగింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మొత్తం 71 మందిలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ అధికారులు ఓట్లను లెక్కించారు. లెక్కింపు ప్రక్రియ 90 గంటలకు పైగా పట్టడం విశేషం. లెక్కింపు ప్రక్రియ ఎక్కడా చిన్న పొరపాటు కూడా తావు లేకుండా సాగింది. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, సేవకులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించారు. అక్కడే సేదతీరుతూ సేవలందించారు. పోలీస్శాఖ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్పీ రంగనాథ్ ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా యంత్రాంగాన్ని సమన్వయం చేశారు.
టీఆర్ఎస్ పాలనకు మద్దతుగా పట్టభద్రులు..
నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టంకట్టారు. సీఎం కేసీఆర్కు అండగా నిలిచారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. మంత్రులు అజయ్కుమార్, మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహాలు ఫలించాయి. ప్రభుత్వం భర్తీ చేసిన 1.32 లక్షల ఉద్యోగాల వివరాలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ శ్రేణులు సమర్థంగా పట్టభద్రులకు విశదీకరించడం కూడా కలిసి వచ్చింది. గెలుపుతో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.