మహబూబాబాద్ : త్వరలో పోడు సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపుతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, ములుగులో పోడు సమస్య ఎక్కువగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఇప్పటికే స్వయంగా ఈ పోడు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.
సోమవారం జెడ్పీ సర్వ సభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
పోడు సమస్యలపై అవగాహన ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి లను సభ్యులుగా.. గిరిజన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నా సీఎస్ సోమేష్ కుమార్తో కలిపి శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేబినెట్ సబ్ కమిటీ వేయడం పట్ల రాష్ట్ర గిరిజనుల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
జడ్పీ సమావేశంలో జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలను చర్చించాం. ఇందులో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు పోడు భూముల సమస్యలను కూడా చర్చించాం. జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు వారి విలువైన సలహాలను ఇచ్చారు.
వీటితో పాటు అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిని సావధానంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజనులు ఉన్న మహబూబాబాద్ జిల్లాకు మెడికల్, టీచింగ్, నర్సింగ్ కాలేజీలు ఇచ్చినందుకు సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పెట్టిన తీర్మానం ఆమోదించామన్నారు.
దళిత బంధు పథకాన్ని తీసుకురావడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా జెడ్పీటీసీలు, ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు.