మెదక్: మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధికారులు.. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసైన్డ్దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ఈటలకు చెందిన హేచరీస్లో, దాని పక్కనే ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించారు.
మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన రైతులు సీఎం కేసీఆర్కు నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఫిర్యాదుపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా అచ్చంపేట, హకీంపేట మధ్య, మంత్రి ఈటల ఫామ్హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..