మొదటి నుంచి టీఆర్ఎస్కే పట్టభద్రుల పట్టం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుసగా గెలుస్తున్న టీఆర్ఎస్.. పల్లా గెలుపుతో మరోసారి సత్తా చాటింది. శాసన మండలి ఏర్పడినప్పటి నుంచి నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ పార్టీకి కంచుకోటగా మారింది. 2007లో ఎమ్మెల్సీగా గెలిచిన కపిలవాయి దిలీప్కుమార్.. పార్టీ నిర్ణయంతో 2008 మార్చిలో రాజీనామా చేశారు.
2009లో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో దిలిప్కుమార్ తిరిగి గెలిచారు. 2015లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పల్లా మరోసారి విజయకేతనం ఎగురేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గం ఏర్పాటయ్యాక తొలిసారి టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది.