దుండిగల్,జూలై 6 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపట్టడంతో పాటు సుచిత్ర నుంచి ప్యాట్నీ వరకు స్కైవే నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలుపడంతో ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ దృష్టికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్ సుచిత్ర నుంచి ప్యాట్నీ వరకు స్కైవే నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే కేంద్రం పట్టించుకోకపోవడం వల్ల పనుల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. బాచుపల్లి రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపడుతామని హామీ ఇచ్చారు.