గద్వాల, జూన్ 24 : మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మొక్కల పంచాయితీ కొనసాగుతున్నది. మొక్కలు కొనుగోలు చేసే సమయంలో అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్ల నుంచి ఇండెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం సర్పంచ్లతో సంబంధం లేకుండా అధికారులు మొక్కలు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఏ పంచాయతీకి ఎన్ని మొక్కలు కావాలో కొనుగోలు చేసి అందుకు సంబంధించిన డబ్బు గ్రామ పంచాయతీ నుంచి అందజేస్తారు. అయితే, ఇక్కడ వారితో సంబంధం లేకుండా అధికారులు మొక్కలు కొనుగోలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. మూడు రోజుల కిందట గద్వాల మండలం అనంతపురం, బస్రాచెర్వు, బీరెళ్లి లత్తీపురం, పూడురు, పుటాన్పల్లి, వీరాపురం గ్రామాలకు సంబంధించి సుమారు 1,800 మొక్కలు అధికారులు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ మొక్కలను నీటి వసతి ఉన్న ప్రాంతంలో లేదా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయ ఆవరణలో డంప్ చేయాలి. కానీ, మండలంలో బీజేపీకి చెందిన నాయకుడి పొలంలో అధికారులు మొక్కలు డంప్ చేశారు.
ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు : ఎంపీపీ
గద్వాల మండలంలో ప్రజాప్రతినిధులు అంటే అధికారులకు గౌరవం లేదని ఎంపీపీ ప్రతాప్గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన మొక్కలు బీజేపీ నాయకుని పొలంలో ఎలా డంప్ చేస్తారన్నారు. సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా.. వారి నుంచి ఇండెంట్ తీసుకోకుండా కమీషన్లకు ఆశ పడి అధికారులు ఇష్టంవచ్చిన మొక్కలు కొనుగోలు చేశారన్నారు.అక్కడ డంప్ చేసిన మొక్కలు గ్రామాలకు పంపిణీ చేయాలని కోరారు.
మధ్యలో ఉందనే డంప్ చేశారు
అన్ని గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయడానికి సెంటర్ అవుతుందనే ఉద్దేశంతో సిబ్బంది అక్కడ మొక్కలు డంప్ చేశారు. ఏ రాజకీయ పార్టీకి అధికారులు వత్తాసు పలకరు. డంప్ చేసిన మొక్కలు పంచాయతీలకు పంపిణీ చేస్తాం.