వడ్డేపల్లి, జూన్ 21: పెండ్లింట చావు బాజా మోగింది. పెండ్లి జరిగిన గంటల వ్యవధిలోనే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీహరం తెలిపిన వివరాల ప్రకారం.. తనగల గ్రామానికి చెందిన ఆవుల రాముడు కొడుకు సూరిబాబు(23)కు సంకాపురం గ్రామానికి చెందిన యువతితో ఆదివారం ఉదయం 10 గంటలకు వరుడి ఇంటి వద్దే వివాహం జరిగింది. అయితే రాత్రి నూతన వధూవరులు ఒకే గదిలో నిద్రించారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో సూరిబాబు కనిపించకపోవడంతో వధువు అత్తామామకు విషయం చెప్పింది. వెంటనే వారు ఇంట్లో చూడగా.. హాలులో ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు. పెండ్లి జరిగిన గంటల వ్యవధిలోనే వరుడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.