బ్రస్సెల్స్: కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకోవడానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి అనవసర ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించాలని ఈయూ దేశాలకు సూచించింది. భారత్లో విస్తరించిన బీ.1.617.2 వేరియంట్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినందున ముందుజాగ్రత్తగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఈయూ కమిషన్ తెలిపింది.
కొవిడ్ విస్తరణ నేపథ్యంలో సభ్యదేశాలన్నీ భారత్ నుంచి అనవసర ప్రయాణాలపై ఎమర్జెన్సీ బ్రేక్ను అమలు చేయాలని ఈయూ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అత్యవసర పనుల నిమిత్తం భారత్ నుంచి వచ్చే వారు కరోనా నిర్ధారణ పరీక్షలు, క్వారెంటైన్ విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని, అందుకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ ప్రకటనలో సూచించింది.